కౌలు రైతు పంట ధ్వంసం.. రైతును ఆదుకున్న ఎంపీ

by Disha Web Desk 13 |
కౌలు రైతు పంట ధ్వంసం.. రైతును ఆదుకున్న ఎంపీ
X

దిశ, దౌల్తాబాద్: రియల్ ఎస్టేట్ వ్యాపారుల దాష్టికానికి ఓ నిరుపేద రైతు పంట నష్టపోయి, ఆందోళనతో ఆసుపత్రి పాలై చికిత్స పొందుతున్నాడని గ్రామస్తులు తెలిపారు. దౌల్తాబాద్ మండల పరిధిలోని గొడుగుపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత రైతు, గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి వారసులకు చెందిన సుమారు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని గ్రామానికి చెందిన గొల్ల శ్రీనివాస్ అనే వ్యక్తి గత మూడు సంవత్సరాలుగా కౌలుకు తీసుకొని పంటలు పండిస్తున్నారు.

ఈ నేపథ్యంలో చేగుంట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన రాజిరెడ్డి, వడియారం గ్రామానికి చెందిన జీవన్ రెడ్డి, విట్టల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి లు శ్రీనివాస్ సాగు చేస్తున్న పంట పొలంలోకి వచ్చి రెండు ఎకరాల కోతకు వచ్చిన ఆముదం పంట మరో ఎకరం వరి పంటను ట్రాక్టర్లతో ధ్వంసం చేశారు. దానికి తోడు రైతును బెదిరించడంతో రైతు తీవ్ర అనారోగ్యం పాలై గజ్వేల్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. కాగా, విషయం తెలుసుకున్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి రైతు కు అండగా నిలిచారు.

తక్షణ సహాయం కింద 50 వేల రూపాయలను జెడ్పిటిసి రణం జ్యోతి ఎంపీపీ సంధ్య మార్కెట్ కమిటీ చైర్మన్ చేతుల మీదుగా అందజేశారు. కాగా, రియల్ ముసుగులో పంట ధ్వంసం చేసిన వారి వేధింపుల నుంచి రైతును కాపాడి పూర్తిస్థాయిలో రైతులు ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. పల్లెల్లో చిచ్చు రేపుతూ రైతులను కూలీలుగా మారుస్తున్న రియల్ ఎస్టేట్ మాఫియాను అరికట్టాలని కోరుతున్నారు.

మూడు సంవత్సరాలుగా సాగు చేస్తున్న రైతు ను ఇబ్బందులకు గురిచేస్తూ పంట ధ్వంసం చేయడం ఆటవిక చర్యగా వారు అభివర్ణించారు. కౌలు రైతుకు అన్ని రకాలుగా అండగా ఉంటామని సందర్భంగా వారు పేర్కొన్నారు. వీరి వెంట BRS మండల పార్టీ అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్ గొడుగుపల్లి BRS గ్రామ కమిటీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి గ్రామ యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed